తత్వ శాస్త్రాధ్యయనంవల్ల ప్రయోజనం ఏమిటి? భౌతికశాస్త్రాలు అతి వేగంగా పురోగమిస్తూ, మానవ జీవిత విధానాన్ని మార్చివేస్తున్న ఈ కాలంలో ఎవరికి కావాలి తత్వమీమాంస అని కొందరు ప్రశ్నించవచ్చు.
ఇది అనాలోచిత వైఖరి తత్వజిజ్ఞాస మానవ నాగరికతకే పునాది వంటిది. వివిధ కాలాలలో ప్రజల మత, సాంఘిక, నైతిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల మీద, విశ్వాసాల మీద ఆయా కాలాల నాటి తత్వవేత్తల ప్రభావం ఎంతో ఉన్నది.
ఈ రచన ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలో ఉన్నవారినే కాక, యువతరం దృష్టిని కూడా ఆకర్షించగలదని ఆశపడుతున్నాను. తత్వశాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి మనస్సు మరింత పరిణతం, మేధ మరింత నిశితం, హృదయం మరింత విశాలం అవుతాయని నాకు అనిపిస్తున్నది.
విల్ డ్యూరాంట్ తన “ప్లెజర్స్ ఆఫ్ ఫిలాసఫీ” లో పేర్కొన్నట్టు తత్వ శాస్త్రాధ్యయనంలో ఒక అనిర్వచనీయానందం కూడా ఉన్నది.
అధ్యయనా నంతరం పఠిత తనకు తానుగా, పూర్తిగా తనదే అయిన ఒక నూతన జీవిత దృక్పథాన్ని ఏర్పరచుకొనగల శక్తిని సముపార్జించు కోగలడని నాకొక నమ్మకం.
భారతీయ మేధావుల మనః కుహరాంతరాలలోనికి, వారి మనోవాల్మీకాలలోనికి, వారు సృష్టించిన మంత్రనగరి సరిహద్దులలోనికి ఈ సాహసయాత్ర కొలంబస్ అమెరికాఖండ యాత్రకు, ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రలోక యాత్రకు తీసిపోదు. ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా పాఠకులను ఆహ్వానిస్తున్నాను.