శ్రీమదాంధ్ర మహాభారతము భారతీయ సాహిత్యానికి మణిపూసలు అయిన గ్రంథాలు ‘రామాయణము’, ‘మహాభారతము’. వ్యాస విరచితము, గణేశ లిఖితము అయిన మహాభారతము పంచమవేదము అని కూడా లోకంలో ప్రసిద్ధి చెందింది. ‘యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ – అంటే భారతంలో పేర్కొన్నది లోకంలో ఉండవచ్చు, కానీ భారతంలో లేనిది మరెక్కడా ఉండబోదు’ అని కొనియాడబడింది ఈ మహాభారతం. వేదాలలో చెప్పబడిన ధర్మసూక్ష్మాలు సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో రాజులు, చారిత్రక వ్యక్తుల కథలతో మేళవించి, అందమైన శైలిలో సోదాహరణంగా వివరించాడు వ్యాస మహర్షి. వ్యాసుడు మొదట ఇరవైనాలుగు వేల శ్లోకాలతో భారతాన్ని రచించాడు. అనేక ఉపాఖ్యానాలు దీనిలో కలవడం వల్ల శ్లోకాల సంఖ్య ఒక లక్షకు పెరిగింది. హిందువుల నైతిక వర్తనకు మూలం అయిన ఈ ఇతిహాసాలలో ఏముంది? వీటిలోని మర్మాలేమిటి? మొదలైన వివరాలు తెలుసుకోవడం, వీటిని ఆమూలాగ్రం అధ్యయనం చేయడం హిందువుల కనీస ధర్మం. ఆ ధర్మం నెరవేర్చడం కోసమే ఈ మహాభారత గ్రంథం.